రామన్నపేటను ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయడంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రకటించడంపై రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి హర్షం వ్యక్తం చేసింది. ప్రజల దశాబ్దాల డిమాండ్కు మంత్రి సానుకూలంగా స్పందించడం శుభపరిణామమని సమితి నాయకులు పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేసిన ప్రకటనతో రామన్నపేట ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయని తెలిపారు. నియోజకవర్గ పునర్విభజనలో రామన్నపేటకు స్థానం కల్పించేందుకు, ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు మంత్రి ఇచ్చిన హామీ ప్రజల ఆకాంక్షలకు బలాన్ని చేకూర్చిందన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంలకు రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధుల సేవలను కొనియాడారు.
కృతజ్ఞతలు తెలిపిన వారిలో సాధన సమితి గౌరవ అధ్యక్షుడు రెబ్బస్ రాములు, అధ్యక్షుడు బొడ్డుపల్లి లింగయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర రమేష్ గౌడ్, కార్యదర్శి గడ్డం యాదగిరి, ఎండి ఫజల్, పెండం రవీందర్తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. రామన్నపేట ప్రజల చిరకాల ఆకాంక్షలను ప్రభుత్వం త్వరలోనే కార్యరూపంలోకి తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి