పరీక్షల కోసం విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదవాలి : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచనలు
పరీక్షల కోసం విద్యార్థులు పూర్తి ఏకాగ్రతతో చదవాలి : జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సూచనలు
Sthanikam joint District Staff Reporter krishna
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ పర్యవేక్షణ
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు చదువుపై సంపూర్ణ ఏకాగ్రతతో దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. శుక్రవారం జిల్లాలోని కంది మండలం, కాశీపూర్ గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (మైనార్టీ)ను, అంగన్వాడీ కేంద్రాన్ని, అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా పరిశీలించారు.మొదట పాఠశాలను సందర్శించిన కలెక్టర్ తరగతి గదులు, వాష్రూములు, పాఠశాల ఆవరణ పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి, మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందుతున్నదా అనే విషయాన్ని స్పష్టంగా ఆరా తీశారు. వంటశాల నిర్వహణ, నిల్వ సదుపాయాలు, తాగునీటి ఏర్పాట్లపై సంబంధిత సిబ్బందికి సూచనలు చేశారు.అనంతరం పదవ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. పరీక్షలు దగ్గర పడుతున్నందున సమయపాలన పాటిస్తూ ప్రతిరోజూ పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయా? సిలబస్ పూర్తయిందా? అనేది విద్యార్థుల నుంచే తెలుసుకున్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కృషి చేస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని ప్రోత్సహించారు. ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.
పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించిన కలెక్టర్ ప్రతిరోజూ శుభ్రత తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తదుపరి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి మౌలిక వసతులు, పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, మెనూ అమలు పరిస్థితులను పరిశీలించారు.చిన్నారులకు పంపిణీ చేయాల్సిన షూలు, ఇతర అవసరమైన సామగ్రి అందరికీ చేరాయా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.పిల్లల ఆరోగ్యం, హాజరు వివరాలు, గర్భిణీ స్త్రీలకు అందిస్తున్న సేవలపై కూడా ఆరా తీశారు.ఆపై గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. మంజూరైన ఇండ్ల సంఖ్య, నిర్మాణ దశలు, లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమ స్థితి వంటి అంశాలపై ఎంపీడీఓ, హౌసింగ్ ఏఈలతో సమీక్ష నిర్వహించారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లకు ఫోటో క్యాప్చరింగ్ వెంటనే పూర్తి చేసి ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు సమయానికి చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విద్యా రంగం నుంచి గృహనిర్మాణం వరకు ప్రతి అంశంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, పంచాయతీ సెక్రటరీ, ఇంజినీరింగ్ అధికారులు, హౌసింగ్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి