హైదరాబాద్: ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని రాజకీయ విశ్లేషకుడు, ఆర్థికవేత్త, వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ అన్నారు. “80 ఏళ్ల స్వాతంత్ర్యం–పౌరుల హక్కులు” అనే అంశంపై సహారా ఎస్టేట్లో నిర్వహించిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీనియర్ సిటిజన్స్ అధ్యక్షుడు ఎన్. ఆదినారాయణరెడ్డి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కోసం రూపొందించిన రాజ్యాంగాన్ని పాలకవర్గాలే బలహీనపరిచే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులను క్రమంగా హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన మీడియాలో అధిక భాగం కార్పొరేట్ వర్గాల ఆధీనంలో ఉండటంతో ప్రజలకు సరైన సమాచారం చేరడం లేదని విమర్శించారు.
పార్లమెంట్లో ప్రజలకు సంబంధించిన కీలక సమస్యలపై తగినంత చర్చ జరగడం లేదని అన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేసే ఎన్నికల వ్యవస్థలోనూ లోపాలు ఉన్నాయని, ఎన్నికల సంస్కరణలపై ADR సంస్థ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించిందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడేందుకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, పౌరులు మరింత చురుకుగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల జాబితాల సవరణ పేరుతో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా ఎన్నికల వ్యవస్థ జాగ్రత్తలు తీసుకోవాలని పరకాల ప్రభాకర్ సూచించారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం నిలబెట్టాల్సిన బాధ్యత సంబంధిత వ్యవస్థలపై ఉందన్నారు.
ప్రజలు స్తబ్దతకు గురికాకుండా తమ హక్కుల పరిరక్షణ కోసం పౌరులుగా, సంస్థలుగా స్పందించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అనంతరం కాలనీ ప్రజలు లేవనెత్తిన పలు సమస్యలపై ఆయన స్పందించి సమాధానాలు ఇచ్చారు.
కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నోముల సుదర్శన్రెడ్డి, ఫ్యాక నాయకులు రవీంద్రశర్మ, డీఏఎస్వీ ప్రసాద్రావు, ఉమామహేశ్వరరావు, కామేష్బాబు, ఎస్.కె. జానీ, ఎన్. అంజయ్య, కీసరి నర్సిరెడ్డి, ఏబూసి నరసింహ, పృథ్వి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి