భువనగిరి: ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి దివ్యాంగ మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన ఘటనపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తీవ్రంగా స్పందించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, ఆరోపణలు నిజమని తేలితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకం ద్వారా ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి మహిళను మోసం చేసి లైంగికదాడికి పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. దివ్యాంగ మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని వేధింపులకు, దాడులకు పాల్పడటం మానవ హక్కులకు, దివ్యాంగుల హక్కులకు విరుద్ధమన్నారు.
బాధితురాలికి రక్షణ కల్పించాలి.
పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపేందర్ కోరారు. బాధితురాలికి పూర్తి రక్షణ కల్పించి న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు అందించే విషయంలో మధ్యవర్తులు, ఇతరుల జోక్యంతో మోసాలు, వేధింపులు జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఎన్పీఆర్డీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు రచ్చ బిక్షపతి, కార్యదర్శి వెంకన్న, ఉపాధ్యక్షుడు బుర్ర మధు, సహాయక కార్యదర్శి కే. గోవర్ధన్, జె. హైమావతి, బి. రాములు, యాట చందు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి