హైదరాబాద్: పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ వర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. జీవో 97 అమలైతే పేద, గ్రామీణ విద్యార్థులు తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్యను అభ్యసించే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు భూక్యా వినోద్ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వంశీ వర్ధన్రెడ్డి మాట్లాడుతూ.. జీవో 97పై ఇప్పటికే విద్యార్థుల్లో ఆందోళన నెలకొందన్నారు. ముఖ్యంగా గ్రామీణ, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో పెరిగే విద్యా ఖర్చులను భరించలేక కోర్సులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సాంకేతిక విద్యకు దూరమైతే పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 97ను పునఃసమీక్షించి ఉపసంహరించుకోవాలని కోరారు.
విద్యార్థుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చినట్లు ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా గర్ల్స్ కన్వీనర్ శ్రావణి, జిల్లా సహాయ కార్యదర్శి చింత వెంకటేష్, మండల కార్యవర్గ సభ్యుడు చందు, నాయకులు నిఖిల్తో పాటు పలువురు పాలిటెక్నిక్ విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి