ప్రైవేట్ సర్వేయర్పై చర్యలు తీసుకోవాలని వినతి
బాధితులకు ముందస్తు ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండా, ప్రైవేట్ వ్యక్తితో దౌర్జన్యంగా భూ సర్వే నిర్వహించిన సర్వేయర్పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మండల పరిధిలోని తంగడపల్లికి చెందిన మైలారం రాఘవేంద్ర శనివారం ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి కథనం ప్రకారం.. తంగడపల్లి గ్రామ శివారులో మైలారం నరసింహ, పద్మలకు ఆరెకరాల భూమి ఉంది. వారి భూమికి ఆనుకుని ఉన్న మాదిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు సర్వే కోసం రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పొల పొరుగు రైతులకు ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రభుత్వ నోటీసులు ఇవ్వకుండానే వెంకటరమణ అనే ప్రైవేట్ వ్యక్తి తాను ‘అసిస్టెంట్ సర్వేయర్’నని చెప్పుకుంటూ శనివారం పొలం వద్దకు వచ్చి హద్దురాళ్లు పాటేందుకు ప్రయత్నించారు. సమాచారం లేకుండా సర్వే చేయడంపై బాధిత రైతు ప్రశ్నించగా, ఆయనను దౌర్జన్యంగా పక్కకు నెట్టివేసి హద్దులు నాటారు.
సమాచారం అందుకున్న రైతు కుమారుడు రాఘవేంద్ర అక్కడికి చేరుకుని అనుమతి పత్రాలు చూపించాలని నిలదీయడంతో సదరు వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అధికారులు వెంటనే స్పందించి, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆర్డీఓను వేడుకున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి