చిట్యాల: నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో శనివారం స్కూల్ పీపుల్ లీడర్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై ఆచరణాత్మక అవగాహన కల్పించే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఎన్నికల్లో విద్యార్థులు తమకు నచ్చిన ప్రతినిధులకు ఓటు వేసి నాయకులను ఎన్నుకున్నారు. బాలుర విభాగంలో 9వ తరగతికి చెందిన ఏ. సాత్విక్ స్కూల్ పీపుల్ లీడర్గా, బాలికల విభాగంలో ఆగు దివ్యభాను ఎన్నికయ్యారు. స్పోర్ట్స్ హెడ్ బాయ్గా ఎస్.కె. సోను సోయల్, స్పోర్ట్స్ హెడ్ గర్ల్గా ఆర్. వైష్ణవి విజయం సాధించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన నాయకులతో పాఠశాల నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ జూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు చిన్ననాటి నుంచే ఆచరణాత్మకంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో స్కూల్ ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు.
విద్యార్థుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేసే నైపుణ్యం కూడా ఇటువంటి ఎన్నికల ద్వారా పెంపొందుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకోవడం, బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా విద్యార్థులకు భవిష్యత్లో నాయకత్వ లక్షణాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఏవో పోల గోవర్ధన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి