దామరచర్ల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులతో చపాతీలు చేయిస్తున్నారని ఆరోపణలు.
విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ.
దామరచర్ల: తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నతంగా చదువుకోవాలనే ఉద్దేశంతో బీసీ బాలికల గురుకుల పాఠశాలలో చేర్పిస్తే.. అక్కడ విద్యార్థినులతో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వెలువడటం ఆందోళన కలిగిస్తోంది. దామరచర్లలోని బీసీ బాలికల గురుకుల పాఠశాలలో కొంతమంది విద్యార్థినులతో చపాతీలు తయారు చేయిస్తున్నారని, మరికొంతమందితో వంటకు సంబంధించిన పనులు చేయిస్తున్నారని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) నల్లగొండ జిల్లా కమిటీ ఆరోపించింది.
విద్యార్థినుల చదువుపై దృష్టి పెట్టాల్సిన పాఠశాల యాజమాన్యం, ఆర్సీవో, ప్రిన్సిపాల్ విద్యార్థులను పని మనుషులుగా ఉపయోగించడం సరికాదని ఎస్ఎఫ్ఐ నాయకులు పేర్కొన్నారు. వంటశాలలో విద్యార్థినులు పనిచేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.
విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పేర్కొంది. విద్యార్థినులతో వంటపనులు, ఇతర పనులు చేయిస్తున్నారనే ఆరోపణలపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేసింది.విద్యార్థినుల భద్రతకు విఘాతం కలిగించే విధంగా ఏవైనా చర్యలు జరుగుతున్నట్లయితే వాటిని వెంటనే నిలిపివేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి