Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 01, 2026 07:53 PM

నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాల వైఫల్యం: ఏఐవైఎఫ్ ఆగ్రహం

నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాల వైఫల్యం: ఏఐవైఎఫ్ ఆగ్రహం

నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాల వైఫల్యం: ఏఐవైఎఫ్ ఆగ్రహం
March 01, 2026 06:02 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర విమర్శించారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి, వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ సత్యనారాయణరెడ్డి భవన్‌లో నిర్వహించిన ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ ప్రకటనలు తగ్గిపోవడం, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కోల్పోవడం కలిసి నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నియామక ప్రక్రియలు ఆలస్యమవడం, పరీక్షల ప్రకటనలు సంవత్సరాల తరబడి వాయిదా పడటం, కోర్టు వ్యవహారాలు, పరిపాలనా లోపాలు యువతలో అనిశ్చితిని పెంచుతున్నాయని అన్నారు.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని, నియామక వ్యవస్థను వేగవంతం చేయాలని ప్రభుత్వాలను కోరారు. ప్రైవేట్ రంగంపై నియంత్రణలు తీసుకువచ్చి ఉద్యోగ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా యువతకు ఆర్థిక మద్దతు అందించాలని సూచించారు. సామాజిక భద్రత, ఆరోగ్య బీమా, విద్యా సహాయం వంటి రంగాల్లో యువతకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సామాన్యుల సమస్యలను విస్మరిస్తోందని ఆరోపించారు.

అలాగే తెలంగాణలో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) సంపూర్ణ జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడంలో స్పష్టమైన కాలపట్టిక ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రాబోయే రాష్ట్ర బడ్జెట్లో యువజన రంగానికి అధిక నిధులు కేటాయించి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు రాజీవ్ యువ వికాస పథకాన్ని అమలు చేయాలని ఏఐవైఎఫ్ కోరింది.

ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు మొగిలి లక్ష్మణ్, కొంకుల రాజేష్, ఎత్తం మహేష్, కళ్యాణ్, ప్రవీణ్, నర్సింహా, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News