మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఐద్వా
మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి: ఐద్వా
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా: మహిళల సంక్షేమం కోసం అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు గడిచినా వాటి అమలులో పూర్తిగా విఫలమైందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి విమర్శించారు.
ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక్కరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి మహిళలను సభ్యత్వంలో చేర్చారు.
ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ మహిళలకు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500, విద్యార్థినీలకు స్కూటీలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్ పెంపు వంటి పలు హామీలు ఇచ్చిందని గుర్తుచేశారు. అయితే ఇప్పటి వరకు వాటిలో చాలా వరకు అమలు కాలేదని అన్నారు.
డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించడం లేదని, గ్యాస్ సబ్సిడీ సక్రమంగా అందడం లేదని, ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ వంటి పథకాలు కూడా అమలు దశకు రాలేదని విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా ఇతర హామీల్లో పురోగతి కనిపించడం లేదని, గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కూడా పూర్తిగా లేకపోవడం వల్ల మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఇక కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ హయాంలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలను తిరిగి గృహాలకు పరిమితం చేసే విధానాలు ప్రోత్సహించబడుతున్నాయని విమర్శించారు.
మహిళల సమస్యల పరిష్కారం, హామీల అమలు కోసం మహిళలు ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి కొండ హైమావతి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు కూకుట్ల చొక్కాకుమారి, కొండ శోభారాణి, రాంపల్లి కృష్ణవేణి, రాంపల్లి కలమ్మ, ఎడ్ల జ్యోతి, ఎడ్ల పుష్ప, ఎడ్ల సునీత, ఆకారం తులసమ్మ, బొజ్జ హేమలత, మెరుగు సుశీల, మెరుగు మహేశ్వరి, గౌటి మంజుల తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి