మధ్యాహ్న భోజన పథకంలో యాదాద్రి భువనగిరి ముందంజ
మధ్యాహ్న భోజన పథకంలో యాదాద్రి భువనగిరి ముందంజ
Editor Desk
రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్న జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ
యాదాద్రి భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న PM POSHAN (మధ్యాహ్న భోజన పథకం) అమలులో యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్రంలో ఉత్తమ స్థానాన్ని సాధించింది. 2025–26 విద్యా సంవత్సరంలో పథకాన్ని వినూత్నంగా, సమర్థవంతంగా అమలు చేసినందుకు జిల్లా విద్యాధికారి కందుల సత్యనారాయణ రాష్ట్ర స్థాయి సత్కారం అందుకున్నారు.
హైదరాబాద్లోని Directorate of School Education Telangana కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ డా. నవీన్ నికోలస్, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుల ఆధ్వర్యంలో ఉత్తమంగా పనిచేసిన అధికారులను సత్కరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇద్దరు జిల్లా విద్యాధికారులు, ఇద్దరు మండల విద్యాధికారులు, ఇద్దరు జూనియర్ సహాయకులు, ముగ్గురు ప్రధానోపాధ్యాయులు, ఒక కంప్యూటర్ నిర్వహణ సిబ్బంది, రెండు స్వయం సహాయక బృందాలను గుర్తించి ప్రశంసించారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఇద్దరు జిల్లా విద్యాధికారులలో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి కందుల సత్యనారాయణ ఒకరుగా నిలవడం జిల్లాకు గర్వకారణమైంది.
పథకం అమలులో పారదర్శకత, పర్యవేక్షణలో కట్టుదిట్టమైన చర్యలు, విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించడంలో చూపిన అంకితభావం దృష్ట్యా ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బందిని ప్రోత్సహించడం, బాధ్యతాయుత వ్యవహారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సత్కారం అందజేసినట్లు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త సంచాలకులు ఎం. మదన్మోహన్, అదనపు సంచాలకురాలు ఉషారాణి పాల్గొని అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి