మద్యం తాగుదామని తీసుకెళ్లి హత్య… మెదక్ జిల్లాలో దారుణం
మద్యం తాగుదామని తీసుకెళ్లి హత్య… మెదక్ జిల్లాలో దారుణం
Sthanikam joint District Staff Reporter krishna
మెదక్ జిల్లాలో అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ మహిళను ప్రణాళికాబద్ధంగా హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు కేసును దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొడుపాక గ్రామానికి చెందిన సులోచన (35) భర్త కొంతకాలం క్రితం మరణించడంతో ఆమె ఒంటరిగా జీవనం సాగిస్తోంది. జీవనోపాధి కోసం మెదక్ పట్టణానికి వెళ్లి భవన నిర్మాణ పనులు చేస్తుండేది. ఈ క్రమంలో అక్కడ మేస్త్రిగా పనిచేస్తున్న రాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది.అయితే అదే సమయంలో రాజుకు బూలీ అనే మరో మహిళతో కూడా సన్నిహిత సంబంధం ఉండేది. ఈ విషయం తెలుసుకున్న సులోచన తరచూ రాజుతో గొడవ పడుతూ ఉండేది. రాజు బూలీతో మాట్లాడటం, కలవడం సులోచనకు నచ్చకపోవడంతో ఇద్దరి మధ్య వివాదాలు పెరిగాయి.దీంతో తమ సంబంధానికి సులోచన అడ్డుగా మారుతోందని భావించిన రాజు, బూలీ కలిసి ఆమెను హత్య చేయాలని కుట్ర పన్నారు.ప్రణాళిక ప్రకారం మార్చి 9వ తేదీన మద్యం తాగుదామని చెప్పి సులోచనను బైక్పై తీసుకెళ్లారు.అనంతరం ఏడుపాయల ఆలయం సమీపంలోని చెలిమేకుంట అనే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ముగ్గురూ కలిసి మద్యం సేవించారు.మద్యం మత్తులోకి వెళ్లిన సులోచనపై రాజు, బూలీ కలిసి కర్రతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనను దొంగల దాడిలా చూపించి తప్పించుకోవాలని ప్రయత్నించారు.అయితే ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు అనుమానితులను గుర్తించారు. దర్యాప్తు చేపట్టి రాజు, బూలీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరినీ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి