కీసరలో లంచం బండారం బట్టబయలు
కీసరలో లంచం బండారం బట్టబయలు
GADDAM JAGANMOHAN REDDY
పోస్టుమార్టం నివేదిక పేరుతో రూ.40 వేలు స్వీకరిస్తూ హోంగార్డ్ అరెస్ట్
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కీసరలో అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. పోస్టుమార్టం నివేదిక ఇప్పిస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేసిన హోంగార్డ్ నగేష్ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఉచ్చులో వేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం, తోటకూరు మహేశ్ నాలుగు నెలల క్రితం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులను సంప్రదిస్తున్న క్రమంలో నగేష్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా నివేదిక త్వరగా అందిస్తానని చెప్పి రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తరువాత మృతుడి మేనల్లుడు శరత్తో జరిగిన చర్చల్లో రూ.40 వేలకే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.
ఏసీబీ అధికారులు పన్నిన పథకం ప్రకారం మొదట రూ.5 వేలు స్వీకరించిన నగేష్, రెండో విడతగా రూ.35 వేలు తీసుకుంటుండగా అధికారులు అక్కడికక్కడే పట్టుకున్నారు. స్వీకరించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకుని, నగేష్పై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక వంటి సున్నితమైన అంశంలో డబ్బులు డిమాండ్ చేయడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి