ఏపూర్ను మద్య రహిత గ్రామంగా మార్చాలి
ఏపూర్ను మద్య రహిత గ్రామంగా మార్చాలి
Komidala Mahender reddy
బెల్ట్ షాపుల నిర్మూలనకు కలెక్టర్కు గ్రామ ప్రజల వినతి.
నల్గొండ జిల్లా: చిట్యాల మండలం ఏపూర్ గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న అనధికార మద్యం విక్రయ కేంద్రాలు (బెల్ట్ షాపులు) వెంటనే రద్దు చేయాలని కోరుతూ గ్రామ సంరక్షణా సమితి ప్రతినిధులు, గ్రామ ప్రజలు సోమవారం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రతినిధి మందుల శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన బెల్ట్ షాపుల కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ కూలీలు తమ కష్టార్జితాన్ని మద్యానికి వెచ్చిస్తూ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. యువత, విద్యార్థులు మద్యం వ్యసనానికి బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
గ్రామంలో మద్యం విక్రయాలు పెరగడంతో రాత్రి వేళల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, కుటుంబ కలహాలు అధికమవుతున్నాయని తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయని గుర్తుచేశారు.
ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే అక్రమ మద్యం రవాణాపై, బెల్ట్ షాపుల నిర్వహణపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి ఏపూర్ను పూర్తిస్థాయి “మద్య రహిత గ్రామంగా” తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు.
గ్రామ ప్రజల సంకల్పానికి అనుగుణంగా మద్యరహిత సమాజ నిర్మాణానికి సహకరిస్తామని ప్రతినిధులు స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి