ఆరుద్ర నక్షత్రం, మాసశివరాత్రి వేళ పిల్లలమర్రి శివాలయంలో విశేష పూజలు
ఆరుద్ర నక్షత్రం, మాసశివరాత్రి వేళ పిల్లలమర్రి శివాలయంలో విశేష పూజలు
Biksham
పిల్లలమర్రి లో రెండు శివాలయాలు ఘనంగా పూజలు.
తెల్లవారుజామునే భక్తులతో కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం
ఆరుద్ర నక్షత్రం, సోమవారం మరియు మాసశివరాత్రి ఒకే రోజు రావడంతో సూర్యాపేట మండలంలోని చారిత్రాత్మక పిల్లలమర్రి శివాలయంలో సోమవారం అత్యంత వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు తెల్లవారుజామునే విశేష అభిషేకాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈశ్వరుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదారతో పంచామృతాభిషేకం, అనంతరం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూతన వస్త్రాలంకరణ చేసి, సుగంధ పుష్పాలతో పుష్పార్చన, పవిత్ర బిల్వదళాలతో బిల్వార్చన, దీపనీరాజనం, మంత్రపుష్పం కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి స్వామివారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మాసశివరాత్రి రోజున పరమేశ్వరుని దర్శించుకోవడం, రుద్రాభిషేకం నిర్వహించడం ద్వారా విశేష పుణ్యఫలాలు లభిస్తాయని అర్చకులు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి