ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక
ఏలూరు జిల్లా పోలీసుల వినూత్న ప్రచారం “నేను ఎవరో మీకు తెలుసా?” ఫ్లెక్సీతో నేరస్థులకు హెచ్చరిక
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు: నేరాల నియంత్రణలో కొత్తదనం చూపిస్తూ ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. “నేను ఎవరో మీకు తెలుసా?” అంటూ పాత నేరస్థుల ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో కట్టిన ఈ పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా శుభాకాంక్షలు, రాజకీయ కార్యక్రమాలకే పరిమితమయ్యే ఫ్లెక్సీలను ఈసారి పోలీసులు ప్రజా భద్రత కోసం వినియోగించడం విశేషం. ఇళ్లలో దొంగతనాలు, బైక్ చోరీలు, గొలుసు దోపిడీలు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు దొంగిలించిన కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్థుల ఫోటోలు, పేర్లు, నివాస ప్రాంతాల వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
“జర జాగ్రత్త… వీళ్లు మీ చుట్టుపక్కలే ఉండొచ్చు” అనే హెచ్చరికతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ ప్రచారంతో నేరస్థుల్లో భయం కలిగించడంతో పాటు, ప్రజల్లో జాగ్రత్త భావన పెంపొందించడమే లక్ష్యంగా పోలీసులు చెబుతున్నారు.
ఫ్లెక్సీని చూసిన స్థానికులు పోలీసుల ఆలోచనను అభినందిస్తున్నారు. “నేరాలను అరికట్టడంలో ఇది మంచి ముందడుగు” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా స్థాయిలో కనిపిస్తున్న ఈ ప్రచారం ప్రస్తుతం జిల్లాలో సంచలనంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి