విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన. సమస్యలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: జడ్జి ఎస్. శిరీష
విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన. సమస్యలుంటే ధైర్యంగా ఫిర్యాదు చేయాలి: జడ్జి ఎస్. శిరీష
Editor Desk
రామన్నపేట, జూలై 25 :
విద్యార్థులు చదువుతో పాటు చట్టాలపై అవగాహన పెంపొందించుకుని తమ హక్కులను కాపాడుకునేలా ముందుకు సాగాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష పిలుపునిచ్చారు. రామన్నపేట మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విద్యార్థులు పాఠశాలలో కానీ, ఇంటి నుంచి పాఠశాలకు వచ్చే మార్గంలో కానీ ఎలాంటి వేధింపులు, ఇబ్బందులు ఎదురైనా మౌనంగా ఉండకుండా వెంటనే చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక పోలీసు స్టేషన్ లేదా మండల న్యాయ సేవా అధికార సంస్థకు సమాచారం అందించాలని సూచించారు. విద్యా హక్కు చట్టం, బాలకార్మిక నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధం, పోక్సో చట్టం, కార్మిక చట్టాలు, మాదకద్రవ్యాల నివారణ వంటి అంశాలపై ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని చెప్పారు.
ఏజీపీ సుక్క శ్రావణ్ కుమార్, ప్యానల్ అడ్వకేట్లు యాదాసు యాదయ్య, ఎన్. రమేష్ మాట్లాడుతూ విద్యే సమాజాన్ని మార్చే శక్తి అని, విద్యార్థులు చెడు వ్యసనాలు, దారి తప్పించే ఆలోచనలకు దూరంగా ఉండి లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని సూచించారు. సమాజం పట్ల బాధ్యతతో పాటు చట్టాలపై అవగాహన పెంచుకుంటేనే ఆదర్శ పౌరులుగా ఎదగగలరని పేర్కొన్నారు.ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాయపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ డి. సరోజ, లీగల్ సర్వీసెస్ సభ్యుడు కురిమేటి యాదయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి