చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం
చిట్యాలలో రెచ్చిపోయిన డీజిల్ దొంగలు – నిద్రలో ఉన్న డ్రైవర్ లారీ నుంచి 350 లీటర్ల డీజిల్ మాయం
Komidala Mahender reddy
చిట్యాల, నల్లగొండ జిల్లా: జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు డీజిల్ దొంగల ముఠా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. డ్రైవర్ కాసేపు నిద్రలోకి జారుకుంటే చాలు.. ట్యాంక్ ఖాళీ చేసి పరారవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా చిట్యాల పట్టణ పరిధిలో జరిగిన డీజిల్ చోరీ ఘటన లారీ డ్రైవర్లలో భయాందోళనలకు గురిచేస్తోంది.
కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ డ్రైవర్కు నిద్ర రావడంతో చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్ వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాన్ని నిలిపి విశ్రాంతి తీసుకున్నాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో అక్కడికి చేరుకున్న గుర్తుతెలియని దుండగులు లారీ డీజిల్ ట్యాంక్ మూతను ఐరన్ రాడ్లతో పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్ను చాకచక్యంగా అపహరించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
డీజిల్ చోరీ సమయంలో లారీ పక్కనే ఏపీ30 ఎం 1377 నంబర్ గల కారు నిలిపి ఉంచి అందులో డీజిల్ తరలించినట్లు బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. ఘటన సమయంలో స్థానికులు ఆ కారును గమనించి ఫోటోలు కూడా తీసినట్లు సమాచారం. డ్రైవర్ మేల్కొనేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానిత వాహనం వివరాలు, స్థానికులు తీసిన ఫోటోలు, పరిసర ప్రాంతాల సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దొంగల ముఠాను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇటీవల జాతీయ రహదారిపై వరుసగా జరుగుతున్న డీజిల్ చోరీలు లారీ డ్రైవర్లను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో హైవే పార్కింగ్ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పెంచాలని, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీసు గస్తీ బలోపేతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. డీజిల్ దొంగల ముఠాపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బాధితులు, లారీ యజమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి