బైక్ దొంగతనాలతో గంజాయి దందా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
బైక్ దొంగతనాలతో గంజాయి దందా.. అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు
Komidala Mahender reddy
రూ.10 లక్షల విలువైన గంజాయి, వీడ్ ఆయిల్ స్వాధీనం.. 8 మంది అరెస్ట్..
నల్గొండ: ఒడిశా నుంచి గంజాయి, వీడ్ (హాష్) ఆయిల్ను అక్రమంగా తరలిస్తూ యువతను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 8 మంది నిందితులతో పాటు ఓ మైనర్ను అదుపులోకి తీసుకుని, రూ.10 లక్షల విలువైన 5.6 కిలోల గంజాయి, 100 ఎంఎల్ వీడ్ ఆయిల్, 5 బైక్లు, 4 సెల్ఫోన్లు, డమ్మీ తుపాకీ, బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు, డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని పోలీసులు మునుగోడు బైపాస్ వద్ద నిర్వహించిన దాడిలో ముఠాను పట్టుకున్నారు. విచారణలో నిందితులు ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి, కళాశాల విద్యార్థులు, యువతకు చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు, గంజాయి కొనుగోలుకు అవసరమైన డబ్బు కోసం బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది.ఈ ఘటనపై వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో నలుగురి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
ఈ కేసును విజయవంతంగా ఛేదించిన వన్టౌన్ పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లాలో గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్-100 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి