విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం – పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం – పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Sthanikam District Staff Reporter krishna
జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలు ప్రశాంతంగా,సక్రమంగా నిర్వహించబడేలా జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా చర్యలను చేపట్టింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ పరితోష్ పంకజ్ సంగారెడ్డి ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, సెయింట్ ఆంథోని జూనియర్ కళాశాల, ఎస్.వి. జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను స్వయంగా సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, అత్యవసర వైద్య సిబ్బంది సన్నద్ధత, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ,జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తగిన సంఖ్యలో పోలీసు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, కేంద్రాల వద్ద గుంపులుగా చేరడం, అనవసరంగా తిరగడం నిషేధమని స్పష్టం చేశారు.పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతున్నందున, పరీక్షా కేంద్రం నుండి వంద మీటర్ల పరిధిలో ప్రతులు తీసే దుకాణాలు మరియు ఇతర అనుమతి లేని కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థులు నిర్భయంగా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు జిల్లా పోలీసు శాఖ తరపున చేయబడ్డాయని, తల్లిదండ్రులు మరియు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి