విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ
విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి: ఎస్ఎఫ్ఐ
Editor Desk
భువనగిరి, జిల్లాలో విద్యా వ్యాపారాన్ని అరికట్టి, విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా లావుడియా రాజు మాట్లాడుతూ జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్మిషన్లు చేపడుతున్నాయని ఆరోపించారు. ఫీజులు, బస్సు, ట్యూషన్, గేమ్స్ తదితర పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. పాఠశాలల్లోనే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫాంలు, షూస్ విక్రయిస్తూ విద్యను వ్యాపారంగా మార్చారని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అనేక చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, దుస్తులను ఒకేసారి పంపిణీ చేయాలని కోరారు.
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే కారణంతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా శాఖ అధికారులు ప్రైవేటు పాఠశాలలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు హిందూరాణి, జిల్లా ఉపాధ్యక్షుడు రాహుల్, జిల్లా సహాయ కార్యదర్శులు తిగుల్ల శ్రీనివాస్, పుట్టల ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి