యాదగిరిగుట్ట కొండపై వర్తక సంఘం రద్దు చేసి టెండర్లు వేయాలి: యాదాద్రి పరిరక్షణ కమిటీ
యాదగిరిగుట్ట కొండపై వర్తక సంఘం రద్దు చేసి టెండర్లు వేయాలి: యాదాద్రి పరిరక్షణ కమిటీ
Editor Desk
యాదగిరిగుట్ట కొండపై కొనసాగుతున్న వర్తక సంఘాన్ని రద్దు చేసి, దుకాణాలను పారదర్శకంగా టెండర్ల ద్వారా కేటాయించాలని యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో స్వామివారి పాదాల వద్ద కరపత్రాలను విడుదల చేసి, దేవస్థానానికి జరుగుతున్న ఆర్థిక నష్టంపై అవగాహన కల్పించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి పోస్టుకార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కొండపై దుకాణాలు నిర్వహిస్తున్న వర్తక సంఘం సభ్యులు ఎన్నో ఏళ్లుగా అతి తక్కువ కిరాయితో షాపులను కొనసాగిస్తూ, కొత్త వారికి అవకాశం ఇవ్వకుండా అధిక ధరలకు బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో 30–40 షాపులు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటిని 114కు పెంచి రాజకీయ, అధికార ప్రభావంతో ఇష్టారాజ్యంగా కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.
దేవస్థానం అభివృద్ధి కోసం అనేక మంది స్థానికులు ఇళ్లు, భూములు కోల్పోయినా సరైన న్యాయం జరగలేదని, మరోవైపు గత ప్రభుత్వం కొండ కింద కోట్ల రూపాయల వ్యయంతో కొత్త షాపులు నిర్మించి ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రస్తుత వర్తక సంఘం వల్ల దేవస్థానానికి, భక్తులకు నష్టం తప్ప లాభం లేదన్నారు.
వర్తక సంఘం గడువు ఈ ఏడాది మే 31తో ముగిసిందని, మరోసారి పొడిగింపు ఇవ్వకుండా వెంటనే టెండర్లు నిర్వహించి స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేవస్థాన ఆదాయానికి గండి పడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, పల్లపు బాలయ్య, బండ రామస్వామి, గ్యాదపాక బాలనర్సయ్య, పసుపునూటి మురళి, మాటూరి బాలయ్య, దేవపూజ అశోక్, బండి వాసు, దండబోయిన వీరేష్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి