డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన – ప్రమాదాల తగ్గింపే లక్ష్యం
డ్రైవర్లకు ప్రత్యేక అవగాహన – ప్రమాదాల తగ్గింపే లక్ష్యం
Krishna
ప్రభుత్వం చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు “అరైవ్ అలైవ్” పేరుతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏప్రిల్ 13 నుంచి 18 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమాలపై జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి గ్రామంలో సర్పంచ్లు, యువకులతో గ్రామ స్థాయి రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసి, గ్రామాల్లో ఉన్న రోడ్డు సమస్యలను గుర్తించి ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించడం, రోడ్డు ప్రమాదాల దృశ్యాలను ఎల్ఈడి స్క్రీన్లు, ఫ్లెక్సీల ద్వారా ప్రజలకు చూపించడం, గోడలపై వాల్ పెయింటింగ్లు వేయించడం, పోలీసు కళా బృందాల ద్వారా నాటికలు ప్రదర్శించడం ద్వారా అవగాహన పెంచాలని తెలిపారు. పోలీసులే ముందుగా ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులపై కూడా చలానాలు విధించాలని ఆదేశించారు. ఆటో, లారీ, బస్సు డ్రైవర్ల సంఘాలతో సమావేశాలు నిర్వహించి ట్రాఫిక్ నియమాలపై చర్చించాలని, పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టమ్, లౌడ్స్పీకర్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, డ్రైవర్లు, స్వచ్ఛంద సంస్థలు చురుకుగా పాల్గొని ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని ఎస్పీ పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి