అశాస్త్రీయ భావాలకు అడ్డుకట్ట వేయాలి శాస్త్రీయ విద్యా విధానం కోసం కృషి చేయాలి — డాక్టర్ మువ్వా రామారావు
అశాస్త్రీయ భావాలకు అడ్డుకట్ట వేయాలి శాస్త్రీయ విద్యా విధానం కోసం కృషి చేయాలి — డాక్టర్ మువ్వా రామారావు
స్థానికం బృందం
భువనగిరి, ప్రజలు ఏది శాస్త్రీయం, ఏది మూఢనమ్మకమో తెలియని పరిస్థితుల్లో అయోమయంలో పడుతున్నారని, పాలకులు అశాస్త్రీయ భావజాలాన్ని ప్రోత్సహించడం ఆందోళనకరమని డాక్టర్ మువ్వా రామారావు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని నవ భారత్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన సైన్స్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
హేతుబద్ధ, తార్కిక విద్యా విధానంతోనే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందుతుందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51(ఏ)(హెచ్) శాస్త్రీయ, మానవీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని స్పష్టం చేస్తుందని తెలిపారు. పాఠ్యపుస్తకాల బోధనతో పాటు ప్రయోగాత్మక విధానాలకు ఉపాధ్యాయులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కరువు, నీటి సమస్య, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం వంటి సమస్యలకు శాస్త్రీయ దృక్పథంతోనే శాశ్వత పరిష్కారాలు సాధ్యమవుతాయని అన్నారు. స్వాతంత్ర్యం అనంతరం తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశపెట్టిన శాస్త్రీయ ఆలోచనల ఫలితంగానే Indian Institutes of Technology, All India Institute of Medical Sciences వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వంటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని తెలిపారు.
కళాశాల ప్రిన్సిపాల్ చిక్కా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ హక్కులతో పాటు బాధ్యతలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను విద్యార్థులతో కలిసి చదివించారు. కొండల్ రెడ్డి మేజిక్ ప్రదర్శనలు, సుదర్శన్ పాటలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి