యాదాద్రి భువనగిరి, ఆగస్టు 17: జిల్లాలో వరుసగా ఆలయాలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు యాదాద్రి-భువనగిరి జిల్లా పోలీసులు. మోతకొండూర్, గుండాల, వలిగొండ, ఆత్మకూర్(ఎం) పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన ఆలయ దొంగతనాల కేసులను ఛేదించి ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో సీసీఎల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వాహన తనిఖీల్లో పట్టుబడి..
తిమ్మాపూర్ ఎక్స్రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నంబర్ ప్లేట్ లేని టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో ఆపి తనిఖీ చేశారు. వాహనంపై ఉన్న బండారి దుర్గాప్రసాద్ (23)ను అదుపులోకి తీసుకుని విచారించగా జిల్లాలోని పలు ఆలయాల్లో చేసిన దొంగతనాల గుట్టు విప్పాడు.
ఆలయ సామగ్రి భారీగా రికవరీ
నిందితుడి నుంచి రూ.11,200 నగదు, టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనం, రెండు పెద్ద ఆలయ గంటలు, ఐదు మధ్యస్థాయి గంటలు, శతగోపములు, హారతి ప్లేట్లు, కలశాలు, రాగి పాత్రలు, గోపురం కలశాలు, గోపురం ప్లేట్లు, బంగారు, వెండి వస్తువులు తదితర ఆలయ పూజా సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు ఉపయోగించిన స్పానర్లు, స్క్రూడ్రైవర్లు, ఇనుప రాడ్ తదితర పనిముట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
రెక్కీ చేసి.. స్క్రాప్ దుకాణాలకు అమ్మకాలు
జనసంచారం తక్కువగా ఉండే గ్రామ శివార్లలోని ఆలయాలను ముందుగా రెక్కీ చేసి నిందితులు దొంగతనాలకు పాల్పడేవారని పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన ఆలయ సామగ్రిని వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టి.. అనంతరం స్క్రాప్ దుకాణాల్లో విక్రయించేవారని తెలిపారు.
పోలీసు బృందానికి ఎస్పీ అభినందనలు
ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ పి. మధుసూదన్రెడ్డి మార్గదర్శకత్వంలో, రామన్నపేట ఇన్స్పెక్టర్ ఎం. రవి పర్యవేక్షణలో సీసీఎస్ భువనగిరి సహకారంతో ఆత్మకూర్(ఎం) ఎస్ఐ ఎన్. లక్ష్మీనారాయణ సిబ్బందితో కలిసి కేసులను ఛేదించారు.
పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.
పరారీలో ఉన్న సీసీఎల్ను పట్టుకోవడంతో పాటు నిందితుడి ప్రమేయం ఉన్న ఇతర కేసులపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయ నిర్వాహకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి