ఆదోనిలో అంగన్వాడీల నిరసన పోలీసు దౌర్జన్యాలు ఖండించాలి – అక్రమ అరెస్టులు ఉపసంహరించాలి
ఆదోనిలో అంగన్వాడీల నిరసన పోలీసు దౌర్జన్యాలు ఖండించాలి – అక్రమ అరెస్టులు ఉపసంహరించాలి
స్థానికం బృందం
ఆదోని, : అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం, ఉద్యమాలను అణిచివేసేందుకు పోలీసు బలగాలను వినియోగించడం తీవ్రంగా ఖండనీయమని ఏఐటీయూసీ – అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి చెల్లించాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు యాప్లను ఒకే యాప్గా ఏకీకృతం చేయాలని వారు డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఎలాంటి స్పందన రాకపోవడంతో రాష్ట్రస్థాయి సంఘాల పిలుపు మేరకు ఈ నెల 23 నుంచి 26 వరకు రిలే నిరాహార దీక్షలు, 27న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు, మార్చి 2న విజయవాడలో మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రజాస్వామ్యపరమైన పోరాటాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, దీక్షా శిబిరాల తొలగింపులు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లా ఆదోనిలో మున్సిపల్ మెయిన్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. గౌరవాధ్యక్షులు టి.వీరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.విజయ్కుమార్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో అర్బన్ అధ్యక్షురాలు ఈరమ్మ, కార్యదర్శి కె.శారద, గౌసియా, జానకి, గీతాదేవి, ప్రభావతి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కె.రమేష్కుమార్, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి జి.అంజిత్గౌడ్ హాజరై మద్దతు తెలిపారు.
నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీల డిమాండ్లు న్యాయపరమైనవని, వెంటనే పరిష్కరించాలని కోరారు. అక్రమ అరెస్టులను ఉపసంహరించుకోవాలని, ఉద్యమాలపై నమోదైన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను అణిచివేసే చర్యలను ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి