నల్గొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నల్గొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
NM Yadav
రూ. 1.20 కోట్లతో ఆర్టీసీ బస్టాండ్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన...
రెండు సిటీ బస్సుల ప్రారంభం మెడికల్ విద్యార్థులకు ఉచిత ప్రయాణం...
నల్గొండ : నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా 'మోడల్ సిటీ'గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఆయన పట్టణంలో రూ. కోటి 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ, ఆధునిక శైలి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు రెండు కొత్త సిటీ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.
మహిళలు, విద్యార్థుల సౌకర్యార్థమే సిటీ బస్సులు..
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలోని మహిళలు షాపింగ్, ఇతర అవసరాల కోసం ప్రయాణాల్లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ సిటీ బస్సు సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ విద్యార్థులు ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటోలపై ఆధారపడి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని, ఇకపై వారు ఈ సిటీ బస్సుల్లో పూర్తిగా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి ప్రకటించారు. ఈ బస్సు సర్వీసులు చెరువుగట్టు – ఎస్ఎల్బీసీ మార్గంతో పాటు, ధరవేశిపురం నుంచి దుప్పలపల్లి వరకు ప్రయాణికులకు సేవలు అందిస్తాయని పేర్కొన్నారు.
రూ. 5 కోట్లతో బస్టాండ్ సుందరీకరణ..
నల్గొండ డిపోకు అదనంగా మరో 30 బస్సులను కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. మహిళా సాధికారతలో భాగంగా ఎస్ఎల్బీసీ వద్ద 56 మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ పంపు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, రెస్టారెంట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బస్టాండ్ విస్తరణ పనుల్లో భాగంగా సరికొత్త కౌంటర్లు, వెయిటింగ్ గార్డెన్, ఆధునిక ప్లాట్ఫారాలు, అత్యాధునిక శౌచాలయాలను నిర్మిస్తామని.. ఇందుకోసం అదనంగా రూ. 5 కోట్ల నిధులను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
రూ. 83 కోట్లతో తాగునీటి శుద్ధి వ్యవస్థ..
పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో రూ. 83 కోట్ల వ్యయంతో వాటర్ ఫిల్టర్ (తాగునీటి శుద్ధి) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. పరిసరాల పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుర్షీద్ ఖాన్, మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా ఆర్థిక శాఖ కార్యదర్శి గౌరవ్ ఉప్పల్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఆర్టీసీ ఆర్ఎం జ్యోత్స్న, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు కవిత, రమేష్, లైజన్ ఆఫీసర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి