అడ్డగూడూరులో మరో మైనర్పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం
అడ్డగూడూరులో మరో మైనర్పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం
Komidala Mahender reddy
కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు.. భరోసా కేంద్రానికి తరలింపు.. వరుస ఘటనలతో పోలీసుల పనితీరుపై ప్రశ్నలు.
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎలిజాల ఉమేష్ అనే వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, తనపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చింతలగడ్డ సమీపంలో బాలికను వదిలివెళ్లినట్లు సమాచారం.
స్థానికులు, బంధువులు బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అనంతరం ఆమెను వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ కోసం భరోసా కేంద్రానికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈ నెల 28న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, ఇదే నెల 9న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోలేదనే ఆరోపణల మధ్య, అనంతరం అదే నిందితుడు బాధితురాలిని కిడ్నాప్ చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఒకే నెలలో ఇద్దరు మైనర్ బాలికలు లైంగిక దాడికి గురికావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనల నేపథ్యంలో మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి