డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది. నాలుగు ఆన్లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..
డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది. నాలుగు ఆన్లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..
Editor Desk
మరో నాలుగు కోర్సులకు త్వరలోనే అనుమతి ఆశాభావం
హైదరాబాద్, జూలై 30 : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విద్యా రంగంలో కీలక ముందడుగు వేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు ఆన్లైన్ కోర్సులు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. దేశంలోనే తొలి ఓపెన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన బ్రౌ త్వరలో పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందనుందని వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు.
సెంటర్ ఫర్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విద్యా సంవత్సరానికి ఎనిమిది కోర్సులకు దరఖాస్తు చేయగా, ఎం.ఏ. (తెలుగు), ఎం.కామ్, బి.కామ్ (ఇంగ్లీష్ మీడియం), బి.కామ్ (తెలుగు మీడియం) కోర్సులకు యూజీసీ ఆమోదం తెలిపింది. మిగిలిన నాలుగు కోర్సులకు సంబంధించి యూజీసీ సూచనలు అందాయని, వాటిని పూర్తి చేసి త్వరలోనే అనుమతులు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కెనడాలో అధికారిక పర్యటనలో ఉన్న వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడి సిబ్బందిని అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని విద్యా కార్యక్రమాలను క్రమంగా ఆన్లైన్లోకి తీసుకువస్తూ బ్రౌను పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
యూజీసీ నిర్ణయాన్ని రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, డీన్లు, డైరెక్టర్లు స్వాగతించారు. నాణ్యమైన ఉన్నత విద్యను డిజిటల్ వేదికల ద్వారా మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలక ఘట్టమని పేర్కొన్నారు. కొత్తగా ఆమోదం పొందిన కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి