స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకుంటే పరిశ్రమల ముట్టడి.. డివైఎఫ్ఐ
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. లేకుంటే పరిశ్రమల ముట్టడి.. డివైఎఫ్ఐ
Editor Desk
చిట్యాల మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళనలు, పరిశ్రమల ముట్టడి కార్యక్రమాలు చేపడతామని డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ హెచ్చరించారు.
గురువారం వెలిమినేడు గ్రామంలోని రంగారెడ్డి భవన్లో డివైఎఫ్ఐ చిట్యాల మండల విస్తృతస్థాయి సమావేశం మండల అధ్యక్షుడు పంది నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మల్లం మహేష్ మాట్లాడుతూ.. చిట్యాల మండలంలో పరిశ్రమలు స్థానిక ప్రజల భూములు, సహకారంతో నడుస్తున్నప్పటికీ ఉద్యోగాల విషయంలో మాత్రం స్థానిక యువతను పూర్తిగా విస్మరిస్తున్నాయని మండిపడ్డారు.
కాలుష్యం మాది.. ఉద్యోగాలు పరాయివారికా? అంటూ ప్రశ్నించిన ఆయన.. పరిశ్రమల వల్ల కాలుష్యాన్ని భరిస్తున్న స్థానికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంటే, ఉపాధి అవకాశాలను మాత్రం ఇతర ప్రాంతాల వారికి కట్టబెట్టడం దారుణమన్నారు. ఉద్యోగాల కోసం వెళ్లే స్థానిక నిరుద్యోగులను చిన్నచూపు చూడడం, అర్హత ఉన్నా అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక అర్హులైన యువతకు తక్షణమే ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం, కార్మిక శాఖ అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు ఇదే నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తే స్థానిక నిరుద్యోగులతో కలిసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు, పరిశ్రమల ముట్టడి కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి వడ్డగాని మహేష్, ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ అధ్యక్షుడు ఆరూరి ప్రణీత్, మండల ఉపాధ్యక్షులు కూనూరు గణేష్, గోలి సాయికిరణ్, సహాయ కార్యదర్శి కోనేటి శివ, గ్రామ నాయకులు యశ్వంత్, రాంచరణ్, విఘ్నేష్, లింగస్వామి, రాము, అరుణ్, బాలు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి