ఎల్నినో ఎఫెక్ట్పై కలెక్టర్ అలర్ట్.. తాగునీటి సంక్షోభం నివారణకు ముందస్తు చర్యలు..
ఎల్నినో ఎఫెక్ట్పై కలెక్టర్ అలర్ట్.. తాగునీటి సంక్షోభం నివారణకు ముందస్తు చర్యలు..
Komidala Mahender reddy
చందంపేట:
ఎల్నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు ఇప్పటి నుంచే సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ శాఖ అధికారులు గ్రామాల వారీగా నీటి సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.చందంపేట ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్నారు. తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరిపై ఆధారపడకుండా ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కందులు, కూరగాయలు, కీరదోస వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగుభూములను పడావుగా ఉంచకుండా రైతులకు అవసరమైన సలహాలు, సహకారం అందించాలని పేర్కొన్నారు.
ఆరుతడి పంటలకు అవసరమైన విత్తనాలను ఎంత మేరకు అవసరమైనా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సమతుల్య ఎరువుల వినియోగంపై దృష్టి పెట్టేలా మండల వ్యవసాయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు, వర్షాభావ ప్రభావాన్ని తగ్గించే దిశగా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి