కరపత్రాలు విడుదల చేసిన ఎంహెచ్పిఎస్, కుల, ప్రజాసంఘాల నాయకులు
కరపత్రాలు విడుదల చేసిన ఎంహెచ్పిఎస్, కుల, ప్రజాసంఘాల నాయకులు
Anjali
భారత కరెన్సీ నోట్లపై రాజ్యాంగ రూపశిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రం ముద్రించాలని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి(MHPS ) రాష్ట్ర అధ్యక్షులు అవుకు ఈశ్వరయ్య మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూటూరు రామాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పుట్టపర్తిలో కుల, ప్రజా సంఘాల నాయకులతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఆగస్టు 26న ఉదయం 11 గంటలకు హిందూపురం అంబేద్కర్ భవన్ లో జరగబోయే మహాసభను ఉమ్మడి అనంత, సత్యసాయి జిల్లాల నలుమూల నుంచి ఎస్సీ, ఎస్టీ, కుల, ప్రజా సంఘాల నాయకులు భారీగా హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎల్.కె.జి నుంచి పీ.జీ వరకు అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. రైతు రుణమాఫీ చేసి ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, స్మశానవాటికలు లేని గ్రామాల్లో స్మశానవాటికలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బహుజన నిరుద్యోగులకు నెలకు రూ.10,000 భృతి ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం రాష్ట్ర నాయకులు సనప నాగన్న, జై భీమ్ రావు పార్టీ అనంత జిల్లా అధ్యక్షులు గట్టు రామాంజనేయులు, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంధం శ్రీనివాసులు, రాయలసీమ జిల్లాల అధ్యక్షులు చియ్యోడు నారాయణస్వామి, ప్రధాన కార్యదర్శి సాకే రాజప్ప, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు కేఎస్ రామన్న, అనంత జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కోళ్ల హరి, ధర్మవరం అధ్యక్షులు సాకే పెద్దన్న, చిలమత్తూరు మండల అధ్యక్షులు రాము తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి