విధుల్లో అలసత్వం సహించం: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
విధుల్లో అలసత్వం సహించం: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
Editor Desk
రామన్నపేట,
విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు హెచ్చరించారు.
బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, వైద్యులు, సిబ్బంది హాజరు వివరాలను రిజిస్టర్ల ద్వారా చెక్ చేశారు. అందరూ సమయపాలన పాటిస్తూ పేషెంట్లకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
ఓపీ రిజిస్టర్ను పరిశీలించిన ఆయన, రోజువారీ రోగుల సంఖ్యపై ఆరా తీశారు. ఆసుపత్రి ఆవరణలో తిరుగుతూ పేషెంట్లను ప్రత్యక్షంగా కలిసి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలతో మాట్లాడి డాక్టర్ల సేవలు, మందుల సరఫరా, రక్త పరీక్షలు ఆసుపత్రిలోనే జరుగుతున్నాయా అని విచారించారు.
ఆసుపత్రి పరిసరాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచాలని ఆదేశించిన ఆయన, శానిటేషన్ సిబ్బంది హాజరు లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శానిటేషన్ కాంట్రాక్టర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఏజెన్సీపై చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు.
అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పన్నుల వసూళ్లపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా వసూళ్ల పురోగతిని పరిశీలించి, ఈ నెలాఖరులోగా 100 శాతం పన్నులు వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు.
తదుపరి నర్సరీని సందర్శించిన అదనపు కలెక్టర్, మొక్కల పెంపకం, సంరక్షణపై సమీక్షించారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి, వాటిని సక్రమంగా సంరక్షించాలని సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పెంపకం కీలకమని, ప్రతి ఒక్కరూ చెట్లను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎండిఓ రాములు, ఎంపీఓ రవూఫ్ అలీ, ఏపీవో వెంకన్న, బిల్ కలెక్టర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి