వేగం వద్దు… ప్రాణం ముద్దు” – ముసునూరులో పోలీసుల హెచ్చరిక
వేగం వద్దు… ప్రాణం ముద్దు” – ముసునూరులో పోలీసుల హెచ్చరిక
GADDAM JAGANMOHAN REDDY
హెల్మెట్ లేకపోతే ప్రమాదం ఖాయం… విజిబుల్ పోలీసింగ్తో అప్రమత్తం చేసిన ఎస్ఐ చిరంజీవి
ముసునూరు : రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ముసునూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. “వేగం వద్దు… ప్రాణం ముద్దు” అనే నినాదంతో ముసునూరు ఎస్ఐ ఎం. చిరంజీవి సిబ్బందితో కలిసి పట్టణంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి వాహనదారులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రోడ్లపై తనిఖీలు చేపట్టి ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగం ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాద సమయంలో ప్రాణాలను కాపాడుకోవచ్చని ఎస్ఐ చిరంజీవి స్పష్టం చేశారు.
అధిక వేగంతో వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే “వేగం వద్దు… ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని సూచించారు.
ఆటో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదని, రోడ్డుపై అడ్డంగా వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటోలను తప్పనిసరిగా ఆటో స్టాండ్లలోనే నిలపాలని సూచించారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్, ఓటీపీలు పంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.
“మీ కుటుంబ సభ్యులు మీపై ఆధారపడి ఉన్నారు… కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించండి. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడమే విజిబుల్ పోలీసింగ్ లక్ష్యం” అని ఎస్ఐ ఎం. చిరంజీవి తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి