వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం
వ్యవసాయ కార్మికుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం
Biksham
మహబూబ్ నగర్లో రాష్ట్ర నాలుగో మహాసభలు మార్చి 14న ఆహ్వాన సంఘం సమావేశం
సూర్యాపేటలో జరిగిన సమావేశంలో పిలుపునిచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాలుగో మహాసభల ఆహ్వాన సంఘం సమావేశం మార్చి 14న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. నాగయ్య తెలిపారు. ఆ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో నిర్వహించిన జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. పోరాటాల పుట్టినిల్లు అయిన మహబూబ్ నగర్లో ఈ సంవత్సరం మే నెల చివరి వారంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మూడు రోజులపాటు ఉత్సాహభరిత వాతావరణంలో ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుండి వెయ్యికి పైగా వ్యవసాయ కార్మిక ఉద్యమ ప్రతినిధులు, వ్యవసాయ నిపుణులు, ఆర్థికవేత్తలు ఈ మహాసభలకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పోరాటాల ద్వారా సాధించిన అనేక చట్టాలను రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
పెరిగిన ధరలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలపై వంట గ్యాస్ ధరలను పెంచడం వల్ల అదనపు భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడిపిందని అన్నారు. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదని విమర్శించారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఇచ్చిన హామీ కూడా అమలు కాలేదని అన్నారు. ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల ప్రాంతంలో పేదలు నివసిస్తున్న భూదానం భూముల్లో గుడిసెలను యంత్రాలతో కూల్చివేసి ఏడువందల మందిని నిరాశ్రయులను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు వెంటనే ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, నష్టపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పథకాన్ని రక్షించేందుకు ఉద్యమాలు
సమావేశంలో మాట్లాడిన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు ఉపాధి హామీ చట్టాన్ని రక్షించేందుకు గ్రామాల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని తెలిపారు. పేద కూలీల ఉపాధికి భంగం కలిగించే కొత్త విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి పనుల్లో ముఖ ఆధారిత చిత్ర విధానాన్ని రద్దు చేయాలని, పాత విధానంలో హాజరు నమోదు కొనసాగించాలని కోరారు. ఈ నెల 10 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి యాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి 20 నుండి 28 వరకు మండల కార్యాలయాల ముందు నిరసనలు, మార్చి 30న జిల్లా కార్యాలయాల ముందు ఆందోళనలు చేపడతామని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పులుసు సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, పోసనబోయిన హుస్సేన్, సోమపంగు జానయ్య, గుంజ వెంకటేశ్వర్లు, షేక్ మహబూబ్ అలీ, నారసాని వెంకటేశ్వర్లు, ఆరే రామకృష్ణారెడ్డి, దోసపాటి బిక్షం, అంజంపల్లి లక్ష్మయ్య, కల్లేపల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి