వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్
వరి పంటలో అగ్గి తెగులు నివారణపై రైతులకు అవగాహన: ఏవో బి.శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంటలను వ్యవసాయ అధికారి (ఏవో) బి.శివశంకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పండించే రైతులు పంటపై వచ్చే తెగుళ్లు, పురుగుల తీవ్రతను తరచూ పరిశీలిస్తూ పంట పొలాల పరిసర పరిస్థితులను విశ్లేషించుకోవాలని సూచించారు.
ప్రస్తుతం చాట్రాయి మండలంలో వరి పంట దుబ్బు చేసే దశలో ఉందని తెలిపారు. ఈ దశలో సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పొలంలో సుమారు 5 సెంటీమీటర్ల నీటిమట్టం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.
ఉదయాన్నే మంచు ఎక్కువగా ఉండటం, పగటిపూట ఎండలు అధికంగా ఉండే పరిస్థితుల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ తెగులు సోకినప్పుడు వరి ఆకులపై వెన్ను మెడ భాగంలో దారపు కండెల ఆకారంలో మచ్చలు కనిపిస్తాయని, మచ్చల అంచుల్లో గోధుమ రంగు ఉండి మధ్యలో బూడిద రంగులో ఉంటాయని వివరించారు. అలాగే కణుపులు నల్లగా మారి కణుపు వద్ద మొక్క విరిగి పడిపోతుందని చెప్పారు.
తెగులు సోకిన పొలాల్లో శీలింద్ర మందులను పిచికారి చేయాలని సూచించారు. ట్రైసైక్లోజోల్ 75 శాతం మందును ఒక లీటర్ నీటికి 0.6 గ్రాములు లేదా ఇసోప్రోతిలిన్ 40 శాతం మందును ఒక లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేదా కాసుగామైసిన్ 3 శాతం మందును ఒక లీటర్ నీటికి 2.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారి చేస్తే అగ్గి తెగులును నియంత్రించవచ్చని వ్యవసాయ అధికారి బి.శివశంకర్ రైతులకు సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి