వరి కొయ్యలు తగలబెట్టడం నేరం.. రైతులు వెంటనే ఆపాలి: మండల వ్యవసాయ అధికారి గిరిబాబు
వరి కొయ్యలు తగలబెట్టడం నేరం.. రైతులు వెంటనే ఆపాలి: మండల వ్యవసాయ అధికారి గిరిబాబు
Komidala Mahender reddy
వరి కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వరి కొయ్యలు, గడ్డిని తగలబెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు భూమి సారానికి తీవ్ర నష్టం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి పగిడిమర్రి గిరిబాబు తెలిపారు. రైతులు వెంటనే వరి కొయ్యలను కాల్చడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వరి కోత యంత్రాలు గడ్డిని సగం ఎత్తువరకు మాత్రమే కోయడంతో, మిగిలిన గడ్డి దున్నే సమయంలో అడ్డుగా ఉంటుందని భావించి చాలామంది రైతులు వాటిని తగలబెడుతున్నారని చెప్పారు. అయితే ఇలా చేయడం వల్ల మట్టిలోని తేమ ఆవిరైపోవడంతో పాటు పంటలకు మేలు చేసే జీవరాసులు కూడా నశిస్తాయని వివరించారు. అదనంగా మట్టి గట్టిపడి దున్నడం కష్టమవుతుందని తెలిపారు.
పంట అవశేషాలను కాల్చినప్పుడు ఉత్పన్నమయ్యే పొగ, బూడిద వలన వాతావరణ కాలుష్యం పెరుగుతుందని ఆయన హెచ్చరించారు. వరి కొయ్యలు వ్యర్థాలు కావని, వాటిని చిన్న ముక్కలుగా చేసి భూమిలో కలిపి దున్నడం ద్వారా సేంద్రియ ఎరువుగా ఉపయోగించుకోవచ్చని సూచించారు. డీకంపోజర్ మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను ఉపయోగించి వరి కొయ్యలను భూమిలో కలిసేలా చేస్తే భూమి సారవంతమై దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.
అలాగే వరి కొయ్యలను పశువుల మేత, కంపోస్ట్, బయోగ్యాస్, వర్మి కంపోస్ట్ తయారీతో పాటు మష్రూమ్ సాగు, పేపర్ తయారీ మరియు బయో ఇంధన ఉత్పత్తుల్లో కూడా వినియోగించవచ్చని పేర్కొన్నారు.వరి కోతల అనంతరం వరికొయ్యలను కాల్చడం నేరంగా పరిగణించబడుతుందని, రైతు సోదరులంతా ఈ చర్యలను వెంటనే నిలిపివేయాలని మండల వ్యవసాయ అధికారి గిరిబాబు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి