వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి
వైద్యులు రోగులకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలి
Biksham
ఆసుపత్రుల్లో వైద్యులు రోగులకు సమయానికి అందుబాటులో ఉండాలని, లేకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హెచ్చరించారు.
గురువారం హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో కొందరు డాక్టర్లు అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి సమయం పూర్తికాకముందే డ్యూటీ నుంచి వెళ్లిపోయిన ఘటనలపై వివరాలు కోరారు.
అనంతరం డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్, అత్యవసర విభాగం, ఓపీ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఓపీ విభాగంలో సమయపాలన పాటించని డాక్టర్లు, కాంట్రాక్ట్ వైద్యులపై చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపారు.
ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా అవగాహన కల్పించాలని అన్నారు.
ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ, శానిటేషన్ సిబ్బంది, నర్సింగ్ అధికారులను అభినందించారు. కాయకల్ప అవార్డు సాధించేలా కృషి చేయాలని కోరారు.
ఆసుపత్రిలో నిర్మాణంలో ఉన్న నూతన ఓపీ బ్లాక్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. సిటీ స్కాన్ యంత్రం పనితీరును పరిశీలించారు. టి-హబ్ నిర్వహణలో ఉన్న లోపాలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాసులు, సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, ఆర్ఎంఓ డాక్టర్ రవి కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ వనజ, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి