వైద్య ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ – త్వరలో ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
వైద్య ఆరోగ్యశాఖలో 18 వేల ఉద్యోగాల భర్తీ – త్వరలో ఏఎన్ఎం, నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలు: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని బాలసదనంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా పాల్గొని బాలసదనం నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ షెట్కర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో సుమారు 18 వేల ఉద్యోగాల భర్తీ చేపట్టామని, మల్టీపర్పస్ ఏఎన్ఎంలు మరియు నర్సింగ్ ఆఫీసర్ల ఫలితాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విద్య, వైద్యం, మహిళా సాధికారత, సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు, శిశువులు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, బాలసదనాలు మరియు అంగన్వాడీల అభివృద్ధిని ప్రభుత్వ నిధులు, సిఎస్ఆర్ నిధులతో చేపడతామని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాల నిర్మాణం, ఖాళీ ఉద్యోగాల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. అనంతరం బాలసదనం బాలికలతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వికలాంగులకు స్కూటీలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంత్, సీడీపీఓ సుజాత తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి