ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి
Biksham
రోడ్డు భద్రత, మోసాలపై విద్యార్థులకు అవగాహన
సూర్యాపేట జిల్లా: ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణతో కృషి చేస్తే మంచి విజయాలు సాధ్యమవుతాయని జిల్లా పోలీసు అధికారి నరసింహ తెలిపారు. చివ్వెంల పోలీస్ స్టేషన్ పరిధిలోని దురాజుపల్లి గ్రామంలోని విద్యాసంస్థలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలను దేవాలయాలుగా భావించి, తరగతి గదులను ప్రయోగశాలలుగా ఉపయోగించుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలుగా భావించి వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని చెప్పారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెంపొందించుకోవాలని, ప్రణాళికతో చదువుకుని లక్ష్య సాధన సాధించాలన్నారు.
రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు. అతివేగం ప్రమాదాలకు కారణమవుతుందని, హెల్మెట్ ధరించడం, సీటు బెల్టు ఉపయోగించడం తప్పనిసరి అన్నారు. రోడ్డు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను గమనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. చిన్న వయసులో వాహనాలు నడపడం ప్రమాదకరమేకాక నేరమని తెలిపారు.
డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. సమాజంలో డ్రగ్స్ నిర్మూలనకు యువత ముందుకు రావాలని, అనుమానాస్పద విషయాలను పోలీసులకు తెలియజేయాలని కోరారు.
సైబర్ మోసాలపై హెచ్చరిస్తూ అపరిచితుల మాటలకు మోసపోవద్దని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. నకిలీ వెబ్సైట్లు, పెట్టుబడుల పేరుతో మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, షీ టీం, విద్యాసంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి