త్యాగం, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
త్యాగం, విశ్వాసానికి ప్రతీక బక్రీద్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
NM Yadav
మునుగోడు రోడ్డు ఈద్గాలో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు..
ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్, ఎస్పీ..
నల్లగొండ : త్యాగానికి, పరమ పవిత్రమైన విశ్వాసానికి బక్రీద్ పండుగ ప్రతీక అని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి ఈద్గాను సందర్శించి, ముస్లిం పెద్దలను, సోదరులను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఐక్యతకు సందేశం సుఖసంతోషాల ఆకాంక్ష..
అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం చేసిన గొప్ప త్యాగాన్ని, ఆయన అచంచల విశ్వాసాన్ని, మానవతా విలువలను స్మరించుకుంటూ జరుపుకునే ఈ పండుగ సమాజానికి ఐక్యత, సహనం, పరస్పర ప్రేమాభిమానాల సందేశాన్ని అందిస్తుందని అన్నారు. పవిత్రమైన బక్రీద్ పండుగ ప్రతి ముస్లిం కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని తాను భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు సోదరభావంతో కలిసి జీవించడం ఇక్కడి సంస్కృతికి, ప్రత్యేకతకు నిదర్శనమని, ఆ గంగా-జమునా తెహజీబ్ స్ఫూర్తి భవిష్యత్తులో మరింత బలపడాలని మంత్రి ఆకాంక్షించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించి, విద్య, ఉపాధి రంగాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని గుర్తుచేశారు. ముస్లింల వసతుల కోసం పట్టణ ప్రాంతాల్లో షాదీఖానాల నిర్మాణం చేపట్టడంతో పాటు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలలో సైతం తగిన అవకాశాలు కల్పించామని వివరించారు.
30 ఏళ్లుగా నల్లగొండలో మత సామరస్యం.!
నల్లగొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా ఎలాంటి మత ఘర్షణలు లేకుండా, అన్ని వర్గాల ప్రజలు ఎంతో సోదరభావంతో, శాంతియుతంగా కలిసిమెలిసి జీవిస్తున్నారని మంత్రి అభినందించారు. ముస్లిం మైనారిటీల సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న మంత్రి.. భవిష్యత్తులోనూ ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
సేవా మార్గంలో పయనించాలి.. కలెక్టర్, ఎస్పీ
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమాజంలో త్యాగ నిరతిని, సేవా మార్గాన్ని గుర్తు చేసే గొప్ప పండుగ బక్రీద్ అని కొనియాడారు. ముస్లిం సోదరులందరికీ ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.ఈ వేడుకల్లో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఏఎస్పీ రమేష్, నల్లగొండ డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శరత్చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, స్థానిక కార్పొరేటర్ మామిడి కార్తీక్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి