తల్లి నుంచి చిన్నారి వరకు ఆరోగ్య రక్షణపై ప్రత్యేక చైతన్యం
తల్లి నుంచి చిన్నారి వరకు ఆరోగ్య రక్షణపై ప్రత్యేక చైతన్యం
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా “తొలి వెయ్యి రోజులు – బంగారు భవిష్యత్తుకు పునాది” అనే అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారిణి కె. లలితా కుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గర్భధారణ ప్రారంభం నుంచి శిశువు రెండేళ్లు పూర్తయ్యే వరకు ఉండే తొలి వెయ్యి రోజులు పిల్లల శారీరక, మానసిక, మేధో వికాసానికి అత్యంత కీలకమని తెలిపారు. ఈ దశలో తల్లి ఆరోగ్యం, సరైన పౌష్టికాహారం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, టీకాలు, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. గర్భిణీ స్త్రీలు రక్తహీనత నివారణకు ఐరన్ మాత్రలు, సమతుల్య ఆహారం తీసుకోవాలని, పుట్టిన శిశువుకు మొదటి ఆరు నెలలు తల్లిపాలు ఎంతో అవసరమని వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు, ప్రీ-స్కూల్ విద్య, ఆరోగ్య పరీక్షలు వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం, పోషణ, బాలల సంరక్షణ, కుటుంబ సంక్షేమం, బాల్య వివాహాల నివారణ, మహిళల సాధికారతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఎన్. సుజాత, డీసీపీఓ రత్నం, జిల్లా సమన్వయకర్త పల్లవి, గ్రామ సర్పంచ్ కె. గంగారాం, మెడికల్ ఆఫీసర్ జబా షాహిర్, ఐసిడిఎస్ సూపర్వైజర్లు జమున, ప్రమీల, సుజాత, మంజుల, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, మెడికల్ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ప్రజలు అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి