తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగికి టోపీ రూ.18.46 లక్షలు కాజేసిన ఆలయ పూజారి
తిరుపతి దర్శనం పేరిట విశ్రాంత ఉద్యోగికి టోపీ రూ.18.46 లక్షలు కాజేసిన ఆలయ పూజారి
GADDAM JAGANMOHAN REDDY
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారం గ్రామంలో తిరుపతి దర్శనం టిక్కెట్లు బుక్ చేస్తానని చెప్పి విశ్రాంత ఉద్యోగిని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి సాయి తరుణ్ ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఓద్వారం గ్రామానికి చెందిన ఒక విశ్రాంత ఉద్యోగి ప్రతిరోజూ ఆలయానికి దర్శనానికి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో అక్కడ పూజారిగా ఉన్న సాయి తరుణ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న పూజారి తిరుపతి దర్శనం టిక్కెట్లు, రైలు టిక్కెట్లు బుక్ చేసి ఇస్తానని చెప్పి బాధితుడి నమ్మకాన్ని సంపాదించాడు.
టిక్కెట్లు బుక్ చేయాలనే నెపంతో బాధితుడి మొబైల్ ఫోన్ తీసుకున్న సాయి తరుణ్, పాస్వర్డ్ తెలుసుకుని బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన సందేశాలు రాకుండా సెట్టింగులు మార్చినట్లు తెలిసింది. అనంతరం ప్రతిరోజూ ఫోన్ తీసుకుంటూ బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.99,999 చొప్పున మొత్తంగా 30 విడతల్లో రూ.18.46 లక్షలను దామెర హరీష్ అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఇటీవల డబ్బులు అవసరమై బాధితుడు బ్యాంకుకు వెళ్లగా ఖాతాలో డబ్బులు లేవని అధికారులు తెలియజేశారు. దీంతో స్టేట్మెంట్ తీసి పరిశీలించగా ప్రతిరోజూ ఉదయం 9 గంటలలోపు భారీ మొత్తాలు బదిలీ అయినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దామెర హరీష్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పరారీలో ఉన్న పూజారి సాయి తరుణ్ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి