తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే రక్షణ కవచం: జగదీశ్ రెడ్డి
తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే రక్షణ కవచం: జగదీశ్ రెడ్డి
Biksham
తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు.
సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణను కేసీఆర్ నాయకత్వంలో కేవలం 12 ఏళ్ల వ్యవధిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ యాస మాట్లాడితే పనులు కావని ప్రజలు భయపడే పరిస్థితిని ఆంధ్ర పాలకులు సృష్టించారని గుర్తుచేశారు. ఎన్నో కుట్రలను ఎదుర్కొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని తెలిపారు.
వ్యవసాయం, పాడి పరిశ్రమ, మాంస ఉత్పత్తుల రంగాల్లో తెలంగాణను ముందంజలో నిలబెట్టిన ఘనత కేసీఆర్దేనని జగదీశ్ రెడ్డి అన్నారు. మార్పు పేరుతో అసత్య హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుంటోందని విమర్శించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండటం విచారకరమన్నారు.
బీజేపీతో కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకుని ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని ఆరోపించారు. నిరుద్యోగులకు అశోక్నగర్లో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు అక్కడికి వెళ్లేందుకు ఎందుకు వెనుకాడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సమైక్య పాలనలో జరిగిన జలవనరుల అన్యాయం మళ్లీ పునరావృతమవుతోందని, రాష్ట్రంలో ఆంధ్ర ఉద్యోగ సంఘాల నేతల పెత్తనం పెరిగిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు పనిచేస్తున్నారని విమర్శించారు.
అంతకుముందు తెలంగాణ తల్లి, తెలంగాణ అమరవీరుల చిత్రపటాలకు జగదీశ్ రెడ్డి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి