సూర్యాపేటలో భారీ రోడ్డు భద్రత ర్యాలీ
సూర్యాపేటలో భారీ రోడ్డు భద్రత ర్యాలీ
Biksham
హెల్మెట్లు ధరించి పోలీసుల బైక్ ర్యాలీ – ప్రజలకు అవగాహన
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు సూర్యాపేట జిల్లా పోలీసులు శనివారం భారీ రోడ్డు భద్రత ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు సిబ్బంది హెల్మెట్లు ధరించి బైక్ ర్యాలీ చేపట్టారు.
జిల్లా ఎస్పీ నర్సింహా ఐపీఎస్ ఆధ్వర్యంలో పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు కొనసాగింది. అనంతరం కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు మానవహారం నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ నర్సింహా మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, రాంగ్ రూట్లో ప్రయాణించవద్దని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకూడదని హెచ్చరించారు. అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కోరారు. పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు పోలీసులు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ అలవాటు చేసుకుంటే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి స్పందించిన స్థానిక వ్యాపారవేత్త మల్లేష్ పోలీసులకు హెల్మెట్లు అందించగా, ఆయనను ఎస్పీ సన్మానించారు.
ఈ ర్యాలీలో అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి తదితరులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి