సూర్యాపేటకు “ఫ్రెష్ బ్రాండ్” – ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల అభివృద్ధి
సూర్యాపేటకు “ఫ్రెష్ బ్రాండ్” – ఆయిల్ ఫామ్ సాగుతో రైతుల అభివృద్ధి
Biksham
జిల్లాలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసి, రైతులకు అధిక ఆదాయం వచ్చేలా “సూర్యాపేట ఫ్రెష్ బ్రాండ్”ను రూపుదిద్దాలని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక స్టార్ బ్యాంకెట్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే పంటలను రైతులు ఎంచుకోవాలని సూచించారు. ఆయిల్ ఫామ్ సాగు ద్వారా రైతులు ఆర్థికంగా బలపడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగుకు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నదని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎన్ఎంఈఓ-ఓపీ పథకం కింద మొక్కలు, ఎరువులు, బిందు సేద్య పరికరాల కోసం మొదటి నాలుగు సంవత్సరాల్లో రూ.50,918 వరకు రాయితీ లభిస్తుందని తెలిపారు. ఒక్కో మొక్కకు రైతులు రూ.20 చొప్పున తమ వంతు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.జిల్లాలో ఆయిల్ ఫామ్ కంపెనీలు నర్సరీల ద్వారా మొక్కలు సరఫరా చేసి, సాంకేతిక సహాయం అందిస్తాయని, పంటను ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసి 14 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాయని వివరించారు. తుంగతుర్తిలో తానే 25 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నానని తెలిపారు.
పంటలకు సరైన మార్కెట్ కల్పించేందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని, త్వరలో 15 ఎకరాల్లో మామిడి మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కోటపహాడ్ గ్రామంలో రైతుల అభ్యర్థన మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.
2012 నుంచి హైదరాబాద్ హయత్నగర్లో డైరీ ఫామ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ కాసం లింగా రెడ్డి, వైస్ చైర్మన్ పంతంగి మల్సూర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోతి గోపాల్ రెడ్డి, తూముల సురేష్ రావు, ధారవత్ వీరన్న నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, హార్టికల్చర్ అధికారి నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి