సుందరయ్య ఆశయాలే సమసమాజ నిర్మాణానికి మార్గం
సుందరయ్య ఆశయాలే సమసమాజ నిర్మాణానికి మార్గం
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి
నల్లగొండ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 42, 47వ డివిజన్లలోని ఆర్టీసీ కాలనీతో పాటు 43వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో సుందరయ్య చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించి ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడిన ఆయన నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర నీటి సరఫరా విధానంపై సుందరయ్య రచించిన పుస్తకం ఆయన దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. దోపిడీకి వ్యతిరేకంగా తన ఇంటి నుంచే ఉద్యమాన్ని ప్రారంభించిన మహానేతగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. తన భూములను పేదలకు పంచిపెట్టి భూ పంపిణీ జరగాలని కోరుతూ కూలి–భూమి పోరాటాలకు నాయకత్వం వహించారని గుర్తుచేశారు.
స్వాతంత్ర ఉద్యమ కాలంలోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా విద్యార్థి దశ నుంచే పోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద శక్తులు యుద్ధాలు సృష్టిస్తూ అశాంతికి కారణమవుతున్నాయని, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా సుందరయ్య స్ఫూర్తితో ప్రజా పోరాటాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. సుందరయ్య ఆశయాలైన దోపిడీ లేని సమసమాజ నిర్మాణం కోసం యువత ముందుకు రావాలని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేయాలని వారు కోరారు. ఆయన త్యాగస్ఫూర్తి, ప్రజాసేవ భావన నేటి రాజకీయ నాయకులకు మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, తుమ్మల పద్మ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య, తిప్పర్తి మండల కార్యదర్శి మన్నెం బిక్షం, పట్టణ కమిటీ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అవుట రవీందర్, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే కందుల అశోక్, ఎండి సర్దార్ అలీ, కుంభం లక్ష్మమ్మ, మాటూరి సునీత, గంజి రాజేష్, బొల్లు రవీంద్ర కుమార్, లకపాక రాజు, బాణాల పరిపూర్ణాచారి, వేముల వెంకన్న, కారంపూడి రాము తదితరులు హాజరై సుందరయ్యకు ఘన నివాళులర్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి