సంపూర్ణ అక్షరాస్యత దిశగా నారాయణఖేడ్ పురపాలక సంఘం ముందడుగు
సంపూర్ణ అక్షరాస్యత దిశగా నారాయణఖేడ్ పురపాలక సంఘం ముందడుగు
Krishna
నారాయణఖేడ్ పురపాలక కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ఉల్లాస్ నవ భారత్ సాక్షరత కార్యక్రమాన్ని ప్రారంభించారు. వయోజన విద్యా శాఖ సహకారంతో నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో వాలంటీర్లకు అక్షరాస్యతపై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మౌనిక, పద్మ వాలంటీర్లకు అక్షర వికాసం, బోధనా విధానాలు, నిరక్షరాస్యులకు సులభంగా చదువు నేర్పించే పద్ధతులు, సామాజిక చైతన్యం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.పురపాలక సంఘ పరిధిలోని నిరక్షరాస్యులకు చదువు నేర్పే బాధ్యతను వాలంటీర్లు చేపట్టనున్న నేపథ్యంలో వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రశాంతి మాట్లాడుతూ చదువు ప్రతి ఒక్కరి హక్కు అని, నిరక్షరాస్యత నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. సేవాభావంతో పనిచేసి నారాయణఖేడ్ను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన పట్టణంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.ఉమ్మడి మెదక్ జిల్లా ఉప సంచాలకుడు వెంకట్ రెడ్డి పాల్గొని వయోజన విద్య ప్రాధాన్యతను వివరించారు. చదువు ద్వారా వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,ఖేఢ్ వైస్ చైర్మన్ దారం శంకర్, కౌన్సిలర్లు, వెంకటశివయ్య, అనిత, మహిళా సంఘాల సభ్యులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి