శోభనాద్రిపురంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహణ రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి: సర్పంచ్ కంచి మధుసూదన్
శోభనాద్రిపురంలో పౌరహక్కుల దినోత్సవం నిర్వహణ రాజ్యాంగ స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేయాలి: సర్పంచ్ కంచి మధుసూదన్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పౌరహక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కంచి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కంచి మధుసూదన్ మాట్లాడుతూ గ్రామంలో కుల, మత వివక్షలకు ఎలాంటి తావు లేకుండా అందరూ ఐక్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, విధులను ప్రతి పౌరుడు గౌరవించి రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. పరస్పర సహకారం, సామరస్యంతో గ్రామానికి మంచి పేరు తీసుకువస్తూ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.
అనంతరం గ్రామ సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జలసిరి కార్యక్రమం ప్రాధాన్యం, గ్రామంలో చేపట్టాల్సిన చర్యలు, వివిధ ప్రభుత్వ శాఖల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై సమగ్రంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు సకాలంలో అందేలా శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని సర్పంచ్ అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో మండల తహసీల్దార్ లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్సై సతీష్ గోపతి, మండల ఆర్ఐ, గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్, జీపీఓ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్థాయి లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, ఉద్యోగులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి