సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు
సమాచారం దాచితే జరిమానా తప్పదు. డీటీడీఓ కార్యాలయ పీఐఓపై రూ.5 వేల ఫైన్.. రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన ఆదేశాలు
Editor Desk
ఇబ్రహీంపట్నం: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కోరిన వివరాలను గడువులోగా అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ (డీటీడీఓ) కార్యాలయ ప్రజా సమాచార అధికారిపై రాష్ట్ర సమాచార కమిషన్ కొరడా ఝళిపించింది. సంబంధిత పీఐఓకు రూ.5 వేల జరిమానా విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్ మొహ్సిన్ పర్వీన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ చట్టం–2005 ప్రకారం దరఖాస్తు ద్వారా కోరినా, నిర్ణీత గడువులోగా సమాచారం అందించలేదు. అనంతరం మొదటి అప్పీల్ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో సమాచార హక్కు చట్టం ప్రకారం ద్వితీయ అప్పీల్ దాఖలైంది.
ఈ అప్పీల్పై శుక్రవారం హైదరాబాద్లోని సమాచార హక్కు భవన్లో రాష్ట్ర సమాచార కమిషనర్ మొహ్సిన్ పర్వీన్ విచారణ చేపట్టారు. అప్పీలుదారుగా సమాచార హక్కు ప్రచార్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాట్రావత్ రాజు నాయక్ స్వయంగా హాజరై తన వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా ప్రజా సమాచార అధికారి నిర్లక్ష్య వైఖరిపై కమిషనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వకపోవడం ద్వారా దరఖాస్తుదారుడి చట్టబద్ధ హక్కుకు భంగం కలిగిందని పేర్కొన్నారు. దీంతో సంబంధిత అధికారికి రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు, వారం రోజుల్లో జరిమానా చెల్లించాలని, అప్పీలుదారు కోరిన పూర్తి సమాచారాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా వెంటనే అందజేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కాట్రావత్ రాజు నాయక్ మాట్లాడుతూ, సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసే అధికారులపై రాష్ట్ర సమాచార కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడం ఆర్టీఐ చట్టం అమలుకు బలాన్నిస్తుందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి